AP and Telangana Weather Update Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై కొనసాగుతున్న పలు వాతావరణ మార్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళ వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయి.
ఇదే సమయంలో ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో వాతావరణంలో అస్థిరత పెరిగింది. ఈ ప్రభావాలకు తోడు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా అధికారులు వేస్తున్నారు.
రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేకుంటే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రైతులు కూడా పంటల సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.





