Vijay’s TVK Eyes AIADMK Support: తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాతి రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు మరో 10 అడుగుల దూరంలో నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీవీకే ప్రతినిధి ఆధవ్ అర్జున.. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 47 సీట్లు గెలుచుకున్న ఏఐఏడీఎంకే మద్దతు కూడగట్టేందుకు విజయ్ వర్గం ప్రయత్నిస్తోంది.
మరోవైపు, ఏఐఏడీఎంకేలోనూ చీలిక సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఓ వర్గం ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా నాలుగు ఎన్నికల్లో (రెండు లోక్సభ, రెండు అసెంబ్లీ) ఓటమిని చవిచూసిన ఏఐఏడీఎంకే, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి టీవీకేతో చేతులు కలపడమే మేలని భావిస్తున్నారట. అయితే, సిద్ధాంతపరంగా బద్ధశత్రువులైన వీరిద్దరూ కలుస్తారా? లేక ఏఐఏడీఎంకేలో చీలిక వచ్చి ఒక వర్గం మాత్రమే విజయ్ వైపు వెళ్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.
ఇదే సమయంలో, ఐదు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయ్కు తమ మద్దతును ప్రకటించింది. గిరీష్ చోడంకర్ ఆధ్వర్యంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో “సెక్యులర్ గవర్నమెంట్” ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సైతం ఈ పరిణామాలపై చర్చించారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాకుండా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలను ఏకం చేసి ఒక బలమైన సంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ లేదా ఏఐఏడీఎంకేలోని ఇతర వర్గాలు చక్రం తిప్పకుండా ముందస్తుగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.





