Jharkhand JPSC Protest: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగార్థుల నిరసనలు, విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ‘JPSC-JSSC రిఫార్మ్స్ మంచ్’ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో చేపట్టిన నిరసన ప్రదర్శన గురువారానికి ఏకంగా 20వ రోజుకు చేరుకుంది. పరీక్షలలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షలను రద్దు చేయాలని, ఈ కుంభకోణంపై సీబీఐ (CBI) లేదా జార్ఖండ్ వెలుపలికి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తుల కమిటీతో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆందోళనకారులు తేల్చిచెబుతున్నారు. తమ డిమాండ్లు తీరేవరకు పోరాటాన్ని విరమించేదే లేదని స్పష్టం చేయడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలోనే గురువారం అసెంబ్లీ దిగ్బంధనానికి యత్నించిన ప్రదర్శనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు, వాటర్ కెనన్లు, భాష్పవాయు గోళాలను ప్రయోగించి విచక్షణారహితంగా చెదరగొట్టారు. అంతటితో ఆగకుండా శాంతిభద్రతల ఉల్లంఘన పేరుతో ఏకంగా 600 మంది నిరసనకారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. వీరిలో 100 మంది పేర్లను నేరుగా చేర్చగా, మరో 500 మంది అజ్ఞాత విద్యార్థులు, ఇతర నిరసనకారులను నిందితులుగా చేర్చడం సంచలనం సృష్టిస్తోంది. ఈ పోలీస్ చర్యలతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విద్యార్థులపై దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ (BJP) రాష్ట్రవ్యాప్త బంద్ పాటించడమే కాకుండా, సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఉద్యమాన్ని తొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడింది. రిక్రూట్మెంట్ కుంభకోణంపై వారం రోజుల్లోగా సీబీఐ విచారణకు ఆదేశించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్ శారీరక పరీక్షల (Physical exam) సమయంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది అభ్యర్థుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంలో ప్రభుత్వం వేసిన ఎస్ఐటీ (SIT) కమిటీలో పదే పదే సభ్యులను మారుస్తుండటంతో దాని విశ్వసనీయతపై ఏబీవీపీ (ABVP) తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్తంగా 1,200కి పైగా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు చేపడతామని ప్రకటించింది. అయితే, ఈ ఆరోపణలను అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయం చేస్తోందని, ఆందోళనలను హింసాత్మకంగా మార్చడానికి ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని రప్పించి రచ్చ చేస్తోందని ప్రత్యారోపణలు గుప్పించింది. కాగా, ఈ సంక్షోభానికి తెరదించేందుకు ప్రభుత్వం, విద్యార్థి ప్రతినిధుల మధ్య జరిగిన ఆరు విడతల చర్చలు విఫలమయ్యాయి. అయితే, రిక్రూట్మెంట్ పరీక్షల సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, విద్యార్థుల అభ్యర్థన మేరకు 14వ JPSC పరీక్షను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఆందోళనలను వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.





