CJP Parliament March: ఢిల్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్, పోటీ పరీక్షల్లో అక్రమాలు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ ఛలో’ ఉద్యమం ఉధృతమైంది. వేలాది మంది విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా కదలడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనకారులు రైల్ భవన్, విజయ్ చౌక్ ప్రాంతాలకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని పార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్ల నిరోధక దళాలు, సీఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలు దాదాపు గంటన్నర పాటు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో పార్లమెంట్ దక్షిణ ద్వారంతో పాటు రెండు ప్రధాన ప్రవేశ మార్గాలను భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేశారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లారు నిరసనకారులు.. పార్లమెంట్కు అత్యంత సమీపం వరకు నిరసనకారులు చేరుకోవడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మెట్రో స్టేషన్ల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ పరిసర ప్రాంతాలను దుర్భేద్యమైన భద్రతా వలయంలో ఉంచగా, పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తున్నారు..
CJP డిమాండ్లు..
CJP ప్రధానంగా మూడు డిమాండ్లతో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. NEET సహా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకులపై నిష్పక్షపాత విచారణ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జాప్యంపై చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. CJP నిరసనల నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. అయితే సమావేశంలో జరిగిన చర్చలపై అధికారిక వివరాలు వెలువడలేదు. మరోవైపు, ప్రభుత్వం తమతో చర్చలకు ముందుకొచ్చిందని CJP ప్రకటించింది. పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ ప్రకటనను జేపీ నడ్డా ఖండించారు. “CJPతో ఎలాంటి చర్చలు జరగవు. అలాంటి సమావేశానికి ప్రభుత్వం అంగీకరించలేదు” అని స్పష్టం చేశారు. దీంతో చర్చల అంశంపై గందరగోళం నెలకొంది.
అయితే, జంతర్ మంతర్ వద్ద గత రెండు రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షను CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విరమించారు. పార్టీ ప్రతినిధుల ప్రకారం, చర్చల సంకేతాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ రాకపోవడంతో పరిస్థితి ఇంకా స్పష్టతకు రాలేదు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు రాజధానిలో మూడు అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, శంకర్ చౌక్ ప్రాంతాల్లో భారీగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక స్పందన బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.





