Rythu Bharosa 3rd Installment Released Today: తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం అమలును దశలవారీగా కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. అనంతరం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లు ప్రభుత్వం నేరుగా జమ చేసింది. అనంతరం రెండో విడతలో మూడు ఎకరాల వరకు సాగుభూమి ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందించింది.
తాజాగా మూడో విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,330.32 కోట్లు నేరుగా జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి రాష్ట్రంలోని 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయం అందించబడింది. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా నిధులు దశలవారీగా జమ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గించడం, సాగు కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలవడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని విడతల వారీగా నిధులు విడుదల చేస్తుండటంతో మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే రైతు భరోసా సాయం జమ కానుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు.





