USA: సింగపూర్లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ భారత్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక ‘‘శక్తివంతమైన దేశం’’ అని, భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని అన్నారు. ఇదే సమయంలో గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేసినట్లు చెప్పారు. అయితే, పలు సందర్బాల్లో సిందూర్ ఆపే విషయంలో ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదని, పాక్ కాళ్ల బేరానికి రావడంతోనే నిలిపేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతీ ఏడాది సింగపూర్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ఉన్నత సైనికాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో 44 దేశాలు పాల్గొన్నాయి. శనివారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రసంగిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపే విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని చెప్పడంతో పాటు, హిందూ మహాసముద్రంలో పవర్ బ్యాలెన్స్ను కాపాడటంలో సహాయపడుతుందని తెలిపారు. భారతదేశం తన భారీ, ముఖ్యమైన సైనిక అవసరాలను తీర్చడానికి సొంత కర్మాగారాలను, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటోందని కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో కలిసి సంయుక్తంగా ఆయుధాలు, సైనిక సామగ్రిని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆసియా ముఖ్యమైన ప్రాంతమని, ఈ ప్రాంతంపై ఒక్క దేశం ఆధిపత్యం చెలాయించడాన్ని కోరుకోవడం లేదని చైనాను గుర్తించి ఆయన అన్నారు.





