దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయా? వాహనదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా? త్వరలోనే ధరలు పెంచేందుకు రంగం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గలేదు. అదే టెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయిల్ సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని భరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించేందుకు సిద్ధపడుతున్నాయి. మే 15లోపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చర్చించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆయిల్ సంస్థల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చమురు సంస్థలు నెలకు దాదాపు రూ.30 వేల కోట్ల వరకు నష్టాలను భరిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 70 డాలర్ల నుంచి 126 డాలర్ల వరకు పెరిగాయి. దీంతో ఇంధన దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినా.. భారత్లో మాత్రం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ప్రభుత్వం స్థిరంగా ఉంచింది. వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలే పెద్ద ఎత్తున భారం మోస్తున్నాయని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరలు పెంచకుండా శాంతింపజేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ధరలపై సమీక్షించాలని ఆయిల్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం.
లీటర్పై భారీ భారం!
ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు పెట్రోల్పై లీటర్కు దాదాపు రూ.24, డీజిల్పై రూ.30 వరకు భరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో త్వరలో ధరల సవరణ తప్పదని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ధరల పెంపుకు ఆమోదం లభిస్తే.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.4 నుంచి రూ.5 వరకు పెరగవచ్చని తెలుస్తోంది. అలాగే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
నాలుగేళ్ల తర్వాత భారీ మార్పు?
2022 తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి భారీ ధరల పెంపు కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి దగ్గర చమురు రవాణా అంతరాయం ఏర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సంక్షోభ పరిస్థితుల్లో భారత్ పలు కీలక చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 36 వేల టన్నుల నుంచి 54 వేల టన్నులకు పెంచారు. అలాగే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించి వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పించారు. అదే విధంగా రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి భారీగా ముడి చమురు దిగుమతులు పెంచారు. దేశంలోని రిఫైనరీలు 100 శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇక పశ్చిమాసియా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చమురు సంస్థలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు.. ధరల పెంపు వల్ల ద్రవ్యోల్బణం అదుపుతప్పకుండా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇక గత దశాబ్దంలో భారత్ ఇంధన రంగంలో మౌలిక వసతులను భారీగా విస్తరించిందని అధికారులు చెబుతున్నారు. 2014తో పోలిస్తే ఎల్పీజీ టెర్మినల్స్ సంఖ్య రెట్టింపు అయింది. అలాగే ముడి చమురు దిగుమతి దేశాల సంఖ్య 27 నుంచి 40కి పెరిగింది. ఎథనాల్ మిశ్రమం 1.5 శాతం నుంచి 20 శాతానికి చేరగా.. వ్యూహాత్మక చమురు నిల్వలను కూడా బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు.
ఏదేమైనా వాహనదారులకు భారీ షాక్ తగిలేటట్టే కనిపిస్తోంది. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరగొచ్చని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఆయిల్ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.





