క్రికెట్ అనేది కేవలం గణాంకాలు, స్కోర్లకే పరిమితం కాదు.. సరైన గురువుల ప్రోత్సాహంతో తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడం కూడా ఇందులో కీలకం. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ విషయంలో ఇదే జరుగుతోంది. భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నీడలో ప్రభ్సిమ్రన్ తన ఆటను మెరుగుపరుచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.
గురువు కాదు.. ఒక అన్నలా..
సాధారణంగా కోచ్, శిష్యుడి మధ్య ఉండే సంబంధం కంటే, వీరిద్దరి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదని ప్రభ్సిమ్రన్ చెబుతాడు. యువరాజ్ తనకు ఒక అన్నలా అండగా ఉంటారని, అర్ధరాత్రి 3 లేదా 4 గంటలకు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి సలహాలు ఇస్తారని ప్రభ్సిమ్రన్ పేర్కొన్నాడు. మొహాలీ లేదా గుర్గావ్లో శిక్షణ కోసం యువరాజ్ స్వయంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ, యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. ఇప్పటికే శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి వారు యువరాజ్ శిక్షణలో రాటుదేలగా.. ఇప్పుడు ప్రభ్సిమ్రన్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు.
Also Read: Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కారు నజర్.. 20న సీఎం రేవంత్తో కలిసి మంత్రి ఉత్తమ్ పర్యటన.!
ఐపీఎల్ 2026లో ప్రభ్సిమ్రన్ జోరు
2019లో ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ, 2025 సీజన్ ప్రభ్సిమ్రన్ కెరీర్ను మలుపు తిప్పింది. ఆ సీజన్లో 549 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో 8వ స్థానంలో నిలిచాడు. అతని ప్రతిభను గుర్తించిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రూ.4 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం IPL 2026లో కూడా అదే జోరును కొనసాగిస్తు్న్నాడు.
యువరాజ్ సింగ్ వంటి మెంటార్ మద్దతు ఉండటంతో.. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ సాధించడమే కాకుండా, త్వరలో జరగబోయే ఐర్లాండ్ సిరీస్ ద్వారా భారత జట్టు (Team India) లో చోటు సంపాదించాలని ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ పట్టుదలతో ఉన్నాడు. యువరాజ్ శిష్యరికం ప్రభ్సిమ్రన్ కెరీర్కు కచ్చితంగా ఒక గొప్ప మలుపు కానుంది.





