27
August, 2026

A News 365Times Venture

27
Thursday
August, 2026

A News 365Times Venture

Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్

Date:

హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరు దేశాలు ఎలా పంచుకోవాలనే అంశంపై అంగీకారానికి వచ్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి వెల్లడించారు. అయితే అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.

రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తస్నీమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల ఇరాన్, ఒమన్ మధ్య జరిగిన చర్చల్లో జలసంధిలో ఇరు దేశాల పరిధి, అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని పంచుకునే విధానం వంటి అంశాలపై ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. అయితే ఈ చర్చల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల చర్చలు ఆలస్యమయ్యాయని ఆయన ఆరోపించారు.

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా ముందుగా ఇరాన్ విధించిన షరతులను అంగీకరించాలని టెహ్రాన్ తేల్చి చెప్పింది. అమెరికా తాజాగా ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు.

ఇటీవల టెహ్రాన్‌లో ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు జరిపిన చర్చల్లో హార్ముజ్ జలసంధికి సంబంధించి దశలవారీ ప్రణాళికపై చర్చించారు. ఇందులో జలసంధి మీదుగా తాత్కాలికంగా సంయుక్త నావిగేషన్ కారిడార్ ఏర్పాటు చేయడం, సముద్రంలో అమర్చిన మైన్లను తొలగించేందుకు సంయుక్త ప్రాజెక్టు చేపట్టడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ శాంతి, స్థిరత్వం పట్ల ఇరాన్‌కు ఉన్న నిబద్ధతకు, పొరుగు దేశాలతో దౌత్యపరమైన చర్చలకు నిదర్శనమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొన్నారు.

హార్ముజ్‌లో రాకపోకలు దాదాపు స్తంభనం

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ.. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఇంకా దాదాపుగా స్తంభించిపోయాయి. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు ఎగుమతుల్లో సాధారణంగా దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతుంది. ఈ కీలక మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. ఇరాన్ ఈ కీలక జలమార్గాన్ని దిగ్బంధించగా.. అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని విధించింది.

యుద్ధ నౌకలకు అనుమతి లేదు

హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ బుధవారం కీలక హెచ్చరిక చేశారు. ఏ దేశానికి చెందిన సైనిక నౌకలను కూడా హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక దిగ్బంధనం విధించకముందే తాము హార్ముజ్‌ను మూసివేశామని తెలిపారు. అమెరికా తన హామీలను నెరవేర్చకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. “హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ముందు అమెరికా ఉల్లంఘించిన అన్ని హామీలను పూర్తిగా అమలు చేయాలి” అని ఘరీబాబాదీ స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించడం, ఇరాన్‌పై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేయడం, యెమెన్ సమస్యను పరిష్కరించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

వాణిజ్య నౌకలపై నిఘా

సైనిక నౌకలను అనుమతించబోమని స్పష్టం చేసిన ఇరాన్.. హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే వాణిజ్య నౌకలను మాత్రం తమ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపింది. దీంతో జలసంధిలో వాణిజ్య రవాణా పునరుద్ధరణకు అవకాశం ఉన్నప్పటికీ.. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు పూర్తి స్థాయిలో హార్ముజ్‌ను తెరవబోమన్న వైఖరిని టెహ్రాన్ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. పదేళ్లకు పైగా అంతర్గత ఘర్షణతో సతమతమవుతున్న యెమెన్ కూడా తాజాగా మధ్యప్రాచ్య యుద్ధంలో భాగమైంది. జూలైలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు 2022లో కుదిరిన కాల్పుల విరమణను పక్కనపెట్టి సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వంపై మళ్లీ దాడులకు దిగడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ഇസ്രഈല്‍ നടത്തുന്ന തുടര്‍ച്ചയായ ആക്രമണങ്ങള്‍ ഇപ്പോഴും ഫലസ്തീനികളെ കൊല്ലുന്നു’: യു.എസ് ഉദ്യോഗസ്ഥന്‍

ന്യൂയോര്‍ക്ക്: ഗസയില്‍ ഇസ്രഈല്‍ തുടരുന്ന സൈനിക ആക്രമണങ്ങളെ വിമര്‍ശിച്ച് ട്രംപ് ഭരണകൂടത്തിന്റെ...

தளபதி எக்ஸிட்; பி.டி.ஆர் என்டரி? டு `புது நட்பு?' விஜய் – மத்திய மாண்புமிகு ரகசிய சந்திப்பு| கழுகார்

சூடுபிடிக்கும் மதுரை அரசியல்!கோ.தளபதி எக்ஸிட்... பி.டி.ஆர் என்டரி..?சட்டமன்றத் தேர்தல் தோல்விக்கு பிறகு...

ಸದನದಲ್ಲಿ ವಿಪಕ್ಷಗಳ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಉತ್ತರಿಸಲಾಗದೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಲಾಯಾನ-ಆರ್.ಅಶೋಕ್

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,25,2026 (www.justkannada.in):  ಅಧಿವೇಶನದಲ್ಲಿ ವಿಪಕ್ಷಗಳ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಉತ್ತರಿಸಲಾಗದೆ ಸದನವನ್ನ ಬಂದ್...

മിന്നല്‍ പ്രളയത്തില്‍ വിറങ്ങലിച്ച് നേപ്പാള്‍; മരണം 160 ആയി: 133 ഇന്ത്യക്കാരുള്‍പ്പെടെ 750 ലധിം പേരെ കാണാനില്ല

കാഠ്മണ്ഡു: നേപ്പാളിലുണ്ടായ മിന്നല്‍ പ്രളയത്തില്‍ മരണ സംഖ്യ ഉയര്‍ന്നു. 160 ഓളം...