Banana Prices Hike in Ravulapalem Market: శ్రావణమాస శోభతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అరటి మార్కెట్ కళకళలాడుతోంది. పండుగలు, పూజల నేపథ్యంలో అరటిపండ్లకు డిమాండ్ పెరగడంతో.. మార్కెట్ యార్డ్ మొత్తం రైతులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. అరటి గెలలకు భారీ గిరాకీ రావడంతో ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో ఒక్కో అరటి గెల ధర రూ.800 నుంచి రూ.1,000 వరకు పలుకుతోంది. గత 15 రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అరటి దిగుబడి తగ్గడం, మరోవైపు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలు వచ్చాయి.
శ్రావణమాసంలో పూజలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో స్థానికంగా అరటిపండ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్కు తగిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ధరలు మరింత పెరుగుతున్నాయి. దీంతో చాలాకాలం తర్వాత రావులపాలెం అరటి మార్కెట్లో శ్రావణ సందడి కనిపిస్తోంది. కోనసీమలో పండించే అరటికి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు భారీగా అరటి కొనుగోళ్ల కోసం రావులపాలెం మార్కెట్కు క్యూ కడుతున్నారు. దీంతో మార్కెట్ యార్డ్ నిత్యం రద్దీగా మారింది.
కర్పూర, చక్కరకెళ్ల రకాల అరటికి అత్యధిక గిరాకీ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ రకాల అరటిని కొనుగోలు చేసేందుకు పక్క రాష్ట్రాల వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో లోడుపై కూడా గతంతో పోలిస్తే అదనంగా రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ధర లభిస్తున్నట్లు తెలుస్తోంది. ధరలు పెరగడంతో అరటి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాధారణంగా దిగుబడి తగ్గితే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే.. అరటి రైతులకు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కోనసీమ అరటికి దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్, శ్రావణమాసంలో స్థానిక వినియోగం పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొనుగోళ్లతో రావులపాలెం మార్కెట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.





