AP Cabinet Approves 34 Percent BC Quota: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 55కు పైగా అజెండా అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు, పరిశ్రమలు, ఇంధనం, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, మౌలిక వసతులకు సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అలానే పట్టణ ప్రాంతాల్లో బీసీలకు 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లను పెంచే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసిన నేపథ్యంలో కేబినెట్ నిర్ణయంకు ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్లోగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.16,500 కోట్ల నిధులు నష్టపోకుండా ఉండేందుకు ఎన్నికలను సకాలంలో నిర్వహించాల్సిన అవసరాన్ని కేబినెట్ పరిగణనలోకి తీసుకుంది.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్లు, చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ చైర్మన్ల విషయంలో పాత విధానాన్ని కొనసాగిస్తూ.. ఒక్కరికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలకు సంబంధించి కూడా కేబినెట్ పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్, వేఫర్ ప్లాంట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో అక్షత్ గ్రీన్టెక్ ఆధ్వర్యంలో సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడ ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో హైబ్రిడ్, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణ, ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన అంశంపైనా నిర్ణయం తీసుకుంది. హ్యామ్ మోడల్లో రూ.7,469.46 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగాల విషయంలోనూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ఆమోదం తెలిపింది. బీసీ విద్యార్థుల కోసం జేఈఈ, నీట్ పరీక్షల శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉన్నత విద్యా రంగానికి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి కొత్త కమిషన్ ఏర్పాటు చేసే బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులకు మార్గం సుగమం కానుంది. ఏపీఎస్బీసీఎల్కు రూ.5 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అవయవ మార్పిడికి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2 నీటి ప్రాజెక్టులపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.





