Trainee IPS officer Uday Krishna Reddy Comments: తనపై వచ్చిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డి స్పందించారు. తనపై తోటి ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పరారీలో లేనని చెప్పారు. మీడియాలో వచ్చిన కధనాలను చూసి నానమ్మ అనారోగ్యానికి గురైందని, ఆమెను చూసేందుకు స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చానన్నారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై పూర్తి విశ్వాసంతోనే విచారణకు సహకరిస్తున్నానని తెలిపారు. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేనని ఉదయ్ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన నాయనమ్మను పరామర్శించేందుకే తన స్వగ్రామమైన ఊళ్లపాలెంకు వెళ్లానని, దానిని పరారిగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. ‘నామీద నాతోటి ఐపీఎస్ చేసిన ఆరోపణలు అవాస్తవం. మీడియాలో వచ్చిన కధనాలను చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురైంది. అందుకే ఆమెను చూసేందుకు మా స్వగ్రామం ఊళ్లపాలెం వెళ్లాను. నేను పరారీలో లేను. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. గ్రామీణ నేపథ్యం నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉంటాను’ అని ఉదయ్ కృష్ణా రెడ్డి అన్నారు.
‘కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎక్కువ విషయాలు మాట్లాడడం సమంజసం కాదు. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్లో రెండు చిరునామాలకు వెళ్లారని తెలిసింది. అవి తాత్కాలిక చిరునామాలే. తన శాశ్వత చిరునామా అయిన ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు అందలేదు. విచారణ అధికారులకు సహకరించేందుకు నేనే స్వచ్ఛందంగా హైదరాబాద్కు వెళ్తున్నా. పోలీస్, న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉంది. విచారణలో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి’ అని ఉదయ్ కృష్ణా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.





