Monsoon Returns: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో మళ్లీ రుతుపవనాలు చురుకుగా మారుతున్నాయని చెప్పింది. జూలై 19న ఇస్రో INSAT-3DR శాటిలైట్ తీసిన చిత్రాల్లో దేశంలో దాదాపు రెండు వంతుల ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి గంగా మైదానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వరకు ఆకాశంలో మేఘాలు విస్తరించాయి.
పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, బెంగాల్ ప్రాంతాల్లో మేఘాల సాంద్రత చాలా ఎక్కువగా ఉందని చిత్రాలు వెల్లడించాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమ గాలుల ప్రభావంతో దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో కూడా మేఘాలు ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇస్రో విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు 60-70 శాతం ప్రాంతాలు మేఘావృతమై ఉంది. అయితే, అన్ని ప్రాంతాల్లో ఒకేస్థాయి వర్షం కురవదని నిపుణులు చెబుతున్నారు. అత్యంత ఎత్తులో ఏర్పడిన చల్లని తుఫాను మేఘాలున్న ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని చెప్పింది.
INSAT-3DR శాటిలైట్ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ స్థిర కక్ష్య నుంచి ప్రతీ అరగంటకోసారి చిత్రాలు పంపిస్తుంది. ఈ చిత్రాల ఆధారంగా ఐఎండీ వర్షాలను అంచనా వేస్తుంది. శాటిలైట్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మేఘాలపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. మేఘాల పైభాగం ఎంత చట్టా ఉంటే అవి అంత ఎత్తులో, తీవ్రమైన మేఘాలుగా పరిగణిస్తారు. జూలై 19న తీసిన చిత్రాల్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మేఘాల ఉష్ణోగ్రత మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, ఉత్తర భారతదేశంపై రుతుపవన ద్రోణి ఆవరించి ఉండటంతో ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.





