AP Liquor Transport Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కు నాంపల్లి కోర్టు మూడు రోజుల ఈడీ కస్టడీని మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి ఈ ముగ్గురిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
కోర్టు అనుమతి తర్వాత చర్లపల్లి జైలులో ఉన్న ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. రానున్న మూడు రోజుల పాటు వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్ను విడివిడిగా, అవసరమైతే ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు, అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
మూడు రోజుల కస్టడీలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపు ప్రక్రియ, టెండర్ల నిబంధనల మార్పులు, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, సంబంధిత అధికారుల పాత్ర తదితర కీలక అంశాలపై ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అధికారులు, సంబంధిత వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిన ఈడీ, కస్టడీ విచారణ ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించాలని భావిస్తోంది. ఈడీ కస్టడీ విచారణ పూర్తైన అనంతరం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విచారణలో లభించే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కేసులో తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.





