Ravi Shastri: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026తో పాటు ట్రై సిరీస్లలో అద్భుతమైన ఫామ్తో దూసుకుపోయిన ఈ యంగ్ సెన్సేషన్ను ఐర్లాండ్తో జరిగిన సిరీస్లోనూ, ఆపై ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లోనూ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ కామెంట్రీలో భాగంగా రవిశాస్త్రి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బోర్డు మేనేజ్మెంట్పై కీలక విమర్శలు చేశారు. వైభవ్ సూర్యవంశీ లాంటి ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఉన్న కీ ప్లేయర్ను బెంచ్కే పరిమితం చేయడం ఎంతమాత్రం తగదని రవిశాస్త్రి పేర్కొన్నారు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ఎలాంటి భయం లేకుండా పవర్ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సత్తా వైభవ్కు ఉందని కొనియాడారు. అతడికున్న హిట్టింగ్ సామర్థ్యానికి ఐర్లాండ్ పర్యటనలోనే తుది జట్టులో అవకాశం ఇచ్చి ఉండాల్సిందని, అక్కడ మైదానాలు చిన్నవి కాబట్టి అతడు బంతిని సులువుగా స్టేడియం పైకప్పు వరకు కొట్టేవాడని అభిప్రాయపడ్డారు. టాప్ క్లాస్ బౌలర్లను సైతం దంచికొట్టే ఇలాంటి దూకుడైన ఓపెనర్ జట్టులో ఉంటే.. మిడిలార్డర్ బ్యాటర్లపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని రవిశాస్త్రి విశ్లేషించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జట్టు బ్యాటింగ్ లైనప్కు మరింత బలాన్ని చేకూర్చడానికి ఈ యువ ఆటగాడికి తక్షణమే తుది జట్టులో చోటు కల్పించాలని రవిశాస్త్రి స్పష్టం చేశారు.
ఇక నిన్నటి మ్యాచ్ ఇంగ్లాండ్తో మ్యాచ్ విషయానికి వస్తే.. ఇటీవలే ఐర్లాండ్ చేతిలో 0-2తో షాకింగ్ సిరీస్ ఓటమిని చవిచూసిన టీమిండియాను, ఈ మ్యాచ్లోనూ ఆరంభంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. మొదటి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరడంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ 27 బంతుల్లోనే 59 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగా, అయ్యర్ మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 82 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. మొదట్లో కాస్త ఓపికగా ఆడిన అయ్యర్, ఆ తర్వాత గేర్ మార్చి క్లాస్ బౌండరీలు, ఎక్స్ట్రా కవర్ మీదుగా ఒక భారీ సిక్సర్తో కేవలం 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాకిబ్ మహమూద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ (lbw)గా వెనుతిరిగినప్పటికీ, అప్పటికే భారత్కు ఓ పటిష్టమైన పునాది లభించింది. చివర్లో శివమ్ దూబే 42 పరుగులతో నాటౌట్గా నిలవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 189/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఫలితం తేలనప్పటికీ, మంచెస్టర్లో జరగబోయే రెండో టీ20 మ్యాచ్కు ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఫామ్లోకి రావడం, ఒక అరుదైన మైలురాయిని అందుకోవడం భారత జట్టుకు ఓ పెద్ద సానుకూలాంశం అని చెప్పాలి.





