గతేడాది మే నెల మధ్యలోనే వానలు దంచికొట్టాయి. దీంతో నదులు, భూగర్భ జలాలు నిండుకుండలా కళకళలాడాయి. దీంతో పాడి పంటలు సమృద్ధిగా పండాయి. ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది కూడా అన్నకున్న సమయాని కంటే ముందుగానే రుతుపవనాలు వస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా ఏడాది వానలు ముఖం చాటేశాయి. తొలకరి కోసం ఎదురు చూస్తున్న కర్షకుడికి ఎదురు చూపులే మిగిలాయి. వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతకు నిరాశే ఎదురవుతోంది. మే నెల గడిచిపోయింది. జూన్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తొలకరి ఎప్పుడు పలకరిస్తుందోనని ఆశగా చూస్తున్నాడు. అయితే ఈసారి మరింత ఆలస్యం కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. పైగా దేశంలో ఎల్నినో ముప్పు పొంచి ఉందని.. ఈ నేపథ్యంలో ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్నినో ప్రభావం కారణంగా ఖరీఫ్ సీజన్పై ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పలు ముందస్తు చర్యలు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర మంత్రిత్వ శాఖల సమన్వయ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం తగ్గించేందుకు ప్రత్యేక పంట పర్యవేక్షణ, సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఒక శాతం విత్తన నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని, వాతావరణ మార్పులను తట్టుకునే స్వల్ప, మధ్యకాలిక పంట రకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ.. వర్షపాతం, విత్తనాల సాగు, జలాశయాల నీటి నిల్వలు, ఎరువుల లభ్యత, పురుగుల ప్రభావం, మార్కెట్ ధరల పరిస్థితులను ప్రతి సోమవారం సమీక్షించేందుకు ప్రత్యేక ‘క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి పనిచేసే సంక్షోభ నిర్వహణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇక భారత వాతావరణ శాఖ (IMD) ఈసారి నైరుతి రుతుపవనాలు దీర్ఘకాల సగటులో 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో పంట ఉత్పత్తిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ఎరువుల డిమాండ్ అంచనాలను కూడా కేంద్రం సవరించింది. యూరియా అవసరాన్ని 194 లక్షల టన్నులుగా అంచనా వేయగా, డీఏపీ (డై-అమ్మోనియం ఫాస్ఫేట్) అవసరాన్ని 60 లక్షల టన్నులకు తగ్గించింది.
ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ వివరాల ప్రకారం.. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి 104.81 లక్షల టన్నులు, దిగుమతులు 27.62 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. మొత్తం ఎరువుల లభ్యత 132.43 లక్షల టన్నులకు చేరింది. ప్రస్తుతం ఖరీఫ్ అవసరాల్లో 51 శాతం మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ఇది సాధారణంగా ఉండే 33 శాతం కంటే చాలా ఎక్కువని తెలిపారు.
అలాగే హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతల ప్రభావం లేకుండా ఇతర దేశాల నుంచి 25 లక్షల టన్నుల యూరియా, 50 లక్షల టన్నుల డీఏపీ సరఫరాను భారత్ ఖరారు చేసుకుంది. ఇవి జూన్, జూలై నెలల్లో దేశానికి చేరనున్నాయి. అదనంగా 70 లక్షల టన్నుల యూరియా కోసం గ్లోబల్ టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆహార భద్రత విషయంలోనూ కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. జూలై 1 నాటికి దేశంలో గోధుమ నిల్వలు 513 లక్షల టన్నులుగా ఉండగా.. నిర్దేశిత బఫర్ ప్రమాణం 275 లక్షల టన్నులు మాత్రమే. అలాగే బియ్యం నిల్వలు 397 లక్షల టన్నులుగా ఉండగా.. అవసరమైన బఫర్ నిల్వ 135 లక్షల టన్నులుగా ఉంది.
ధాన్యాలు, పప్పుధాన్యాలు, చక్కెర ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. బంగాళాదుంప, ఉల్లిపాయ, టమాటా ధరలు కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇక వంటనూనెల సరఫరాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్, రష్యా-ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్… అర్జెంటీనా-బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.





