Minister Narayana: రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయం, కొత్త పార్లమెంట్ నిర్మాణ ఖర్చుల లెక్కలను తప్పుగా చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. “జనం నవ్వుకుంటున్నా మావిగన్ అంటూ పట్టుకుని వేలాడుతున్నారు” అంటూ విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల నివాస భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న ఆరు టవర్లలో ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
జూన్ నెల నుంచి దశలవారీగా ఈ భవనాలను జీఏడీకి హ్యాండోవర్ చేయనున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో రైతుల పాత్ర ఎంతో కీలకమని చెబుతూ, మొత్తం 30,760 మంది రైతులు 35,059 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారని తెలిపారు. అందులో ఇప్పటికే 30,079 మంది రైతులకు ప్లాట్లు కేటాయించామని, కేవలం 681 మంది రైతులకు చెందిన 524 ఎకరాల వ్యవహారం మాత్రమే పెండింగ్లో ఉందన్నారు. ఇప్పటివరకు 63,342 కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, మరో 7,482 రిజిస్ట్రేషన్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు.
అమరావతి పనులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇలాగే మాట్లాడితే వైసీపీకి వచ్చిన 11 సీట్లు కూడా సున్నాగా మారతాయని హెచ్చరించారు. నిర్మాణ వ్యయాలపై మాట్లాడే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించిన మంత్రి, హైదరాబాద్ సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.13,768 ఖర్చయిందని, కొత్త పార్లమెంట్ భవనానికి చదరపు అడుగుకు రూ.16,916 వ్యయం అయిందని చెప్పారు. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్కు చదరపు అడుగుకు రూ.15,000 నుంచి రూ.16,000 వరకు ఖర్చు అవుతుందని వివరించారు. భవిష్యత్తులో అమరావతి ద్వారా సంవత్సరానికి రూ.12 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే అమరావతిలో మిగిలే 5 వేల ఎకరాల భూమితో తీసుకున్న రుణాలను తీర్చగలమని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..





