రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 11 ఇన్నింగ్స్ల్లోనే 236 స్ట్రైక్ రేట్తో 440 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. బుమ్రా, హేజిల్వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఎదుర్కొంటున్న తీరు చూసి, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలనే చర్చ మొదలైంది.
అయితే, వైభవ్ భవిష్యత్తు గురించి డివిలియర్స్ ఒక విలువైన సలహా ఇచ్చారు. వైభవ్ కేవలం టీ20లకే పరిమితం కాకుండా వన్డేలు, టెస్ట్ క్రికెట్ కూడా ఆడాలని ఆయన కోరారు. టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల ఆటగాడిగా శారీరకంగా, మానసికగా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్ అనేది అంత సులభం కాదని, అది ఒక కఠినమైన ప్రయాణమని చెబుతూనే.. వైభవ్ ఆ సవాళ్లను అధిగమించగలడని నమ్మకం వ్యక్తం చేశారు.
ఒకవేళ ఎవరైనా వైభవ్ను కేవలం టీ20 స్పెషలిస్ట్గా మాత్రమే ఉండమని చెబితే, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగిపోవచ్చు కానీ, అసలైన క్రికెట్ అనుభవం కోసం అన్ని ఫార్మాట్లు ఆడాలని డివిలియర్స్ సూచించారు. వైభవ్ రికార్డులు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్లో అత్యధిక సిక్సర్లు (30) కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అండర్-19 వన్డేల్లోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలిచాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో (టీ20, వన్డే) వైభవ్ ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో (టెస్ట్ ఫార్మాట్) అతడి సగటు ప్రస్తుతం తక్కువగా ఉంది. అందుకే తన ఆటలోని లోటుపాట్లను సరిదిద్దుకుని సంపూర్ణ ఆటగాడిగా ఎదగాలంటే టెస్ట్ క్రికెట్ ఆడటం ఎంతో అవసరమని డివిలియర్స్ స్పష్టం చేశారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు భవిష్యత్తులో భారత జట్టుకు టెస్టుల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలని ఆయన ఆకాంక్షించారు.





