తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు బోడ జనార్దన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.
సీనియర్ నాయకుడైన ఆయన చేరికతో ఆ ప్రాంతంలో పార్టీకి కొత్త ఉత్సాహం రానుంది.బోడ జనార్దన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉన్న చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు హయాంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అనుభవజ్ఞుడైన నాయకుడు పార్టీలో చేరుతుండటంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.





