KCR: ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ నాయకుడు, స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం, పార్టీ తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మొత్తంగా రూ. 2 కోట్ల 25 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అధినేత నిర్ణయించారు. ఈ ఆర్థిక సాయంలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు వారి భవిష్యత్తు కోసం చెరో కోటి రూపాయల చొప్పున రూ. 2 కోట్లు కేటాయించారు. అలాగే, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల నిమిత్తం మరో రూ. 25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని ఆదేశించారు. కేవలం ఆర్థిక సహాయంతోనే సరిపెట్టకుండా, పిల్లల చదువులు, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ పూర్తయిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై, ఆ కుటుంబానికి సంబంధించిన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. పెద్ది కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
Date:





