Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) విభాగం గత 100 రోజుల్లోనే భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించి 185 కేసులు నమోదు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నగరంలో పెరుగుతున్న ఆహార కల్తీ ఘటనలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా H-ఫాస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ విభాగం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఆహార తయారీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో కల్తీ ఆహార పదార్థాలు వెలుగులోకి వచ్చాయి.
అధికారుల వివరాల ప్రకారం.. 27 వేల కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 25 వేల కిలోల కృత్రిమంగా పండించిన పండ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలను పట్టుకున్నారు. మరో 9 వేల కిలోల నిల్వ పచ్చళ్లను కూడా సీజ్ చేశారు. టీ పొడి, కోవా, క్రీమ్, నెయ్యి, పన్నీర్, పెరుగు వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడింది.
ముఖ్యంగా పన్నీర్ తయారీలో ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలతో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రాంతాల వారీగా చూస్తే రాజేంద్రనగర్ జోన్ లోనే అత్యధికంగా 55 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో ఆహార తయారీ యూనిట్లు, ఫ్యాక్టరీలు అధిక సంఖ్యలో ఉండటంతో కల్తీ కార్యకలాపాలు ఎక్కువగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు నమోదైన కేసులతో పాటు మరో 247 కేసులను జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. హోటళ్లు, బేకరీలు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కల్తీ ఆహార వ్యాపారులపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో H-ఫాస్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేసి తనిఖీలను విస్తరించనున్నట్లు తెలిపారు. స్టార్ హోటళ్ల నుంచి చిన్న రెస్టారెంట్ల వరకు, ఆహార తయారీ కేంద్రాల నుంచి నిల్వ గోదాముల వరకు విస్తృత తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని, కల్తీకి పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు హెచ్చరించారు.





