US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ఫైర్ (యుద్ధ విరమణ) ఇప్పుడు పూర్తిగా విచ్ఛిన్నమయ్యే ప్రమాదంలో పడింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం ఇరాన్పై వరుసగా రెండోసారి భారీ ఎయిర్స్ట్రైక్ చేస్తోంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 1:30 గంటల ప్రాంతంలో, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇరాన్లోని ‘బందర్ అబ్బాస్’ నగర తూర్పు ప్రాంతంలో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ప్రాంతంలో అమెరికా సైన్యంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు ముప్పుగా మారిన ఇరాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, కేవలం ఆత్మరక్షణ కోసమే ఈ వైమానిక దాడులు చేసినట్లు ఓ అమెరికా అధికారి రాయిటర్స్కు స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ దాడిలో ఇరాన్ ప్రయోగించిన పలు ప్రమాదకరమైన డ్రోన్లను సైతం అమెరికా సైన్యం గాల్లోనే కూల్చేసింది. ఈ అటాక్ను ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఫార్స్’ కూడా ధృవీకరించింది. పేలుళ్లు జరిగిన వెంటనే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి ఆకాశంలోకి కాల్పులు జరిపినప్పటికీ, జరిగిన నష్టంపై ఇరాన్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకుండా విచారణ జరుపుతున్నామని మాత్రమే చెప్పారు.
నిజానికి, సోమవారం రోజే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) దక్షిణ ఇరాన్లోని మిస్సైల్ లాంచ్ సైట్లతో పాటు సముద్రంలో ల్యాండ్ మైన్స్ అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ నౌకలను అటాక్ చేసి ధ్వంసం చేసింది. తమ సైనికుల రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు సెంటకామ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అప్పట్లోనే ప్రకటించారు. అయితే, ఈ దాడులను సీజ్ఫైర్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఇరాన్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, శత్రువుల ఎలాంటి దూకుడుకైనా దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించింది. మరోవైపు, ఒమన్, ఖతార్ దేశాల రాయబారంతో తెరవెనుక శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్పై కఠినమైన దీర్ఘకాలిక ఒప్పందం కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుత శాంతి ప్రతిపాదనలపై తనకు ఏమాత్రం సంతృప్తి లేదని, ఇరాన్కు ఒప్పందం ఇష్టమున్నా లేకపోయినా అది తమ షరతులకు లోబడి మాత్రమే జరగాలని, లేదంటే సైనిక బలంతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా ముగించాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, భవిష్యత్తు ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ షిప్పింగ్ రూట్ను ఇరాన్, ఒమన్లు కలిసి నియంత్రిస్తాయన్న ఇరాన్ వాదనలను ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు. అంతర్జాతీయ జలమార్గం ఏ పరిస్థితిలోనైనా ప్రపంచ వాణిజ్యం కోసం తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఆ తాత్కాలిక శాంతి ఒప్పందం ఇప్పుడు పూర్తిగా మునిగిపోయేలా కనిపిస్తోంది.





