పశ్చిమ బెంగాల్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా చివరి అంకంలో ప్రచారాలు సాగిస్తున్నాయి. అయితే తాజాగా మమతా బెనర్జీకి చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల విరామ సమయంలో ప్రధాని మోడీ ‘ఝల్మురి’ కొనుగోలు చేసి ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కోట్ల వీక్షించారు.

తాజాగా తానేమీ తక్కువ కాదనుకున్నారో ఏమో తెలియదు గానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆదివారం భవానీపూర్లో ఎన్నికల ప్రచారం ముగిశాక ఒక కూరగాయల దుకాణానికి వెళ్లి స్వయంగా వెజిటేబుల్స్తో పండ్లు కొనుగోలు చేశారు. తన కంటికి నచ్చినవాటిని వెతికి కొనుక్కున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పశ్చిమ బెంగాల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 23న ముగిసింది. 152 నియోజకవర్గాల్లో 93 శాతం పోలింగ్ నమోదైంది. చివరి విడత పోలింగ్ బుధవారం జరగనుంది. 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదలకానున్నాయి.





