West Bengal: పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో గల చండీతలా పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ కల్యాణ్ బెనర్జీపై అక్కడ దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది. ఈ ఘటన అనంతరం తలపై తడి రూమాలు పెట్టుకుని కనిపించిన కల్యాణ్ బెనర్జీ.. అరెస్ట్ అయిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం (మెమోరాండం) సమర్పించడానికి వెళ్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు తనపై దాడికి తెగబడ్డారని బెనర్జీ ఆరోపించారు. శత్రుమూకలు తన తలపై రాయి లేదా బంతి లాంటి వస్తువుతో బలంగా కొట్టి గాయపరిచారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడానికి వెళ్తున్న వారిపై ఇలా దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. కల్యాణ్ బెనర్జీకి ఎలాంటి గాయం కాలేదని, కేవలం డ్రామా చేస్తున్నారని మండిపడింది. అసలు విషయానికొస్తే.. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు వినతిపత్రం ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు చేరుకున్న సమయంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మెమోరాండం సమర్పించడానికి ముందే అక్కడకు చేరుకున్న తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పరం తీవ్రమైన నినాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు తృణమూల్ మద్దతుదారులను ఉద్దేశించి ‘చోర్-చోర్’ (దొంగలు) అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను, కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు.
మరోవైపు.. శనివారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో కొందరు స్థానికులు దుర్మార్గాంగా ప్రవర్తించారు. అభిషేక్పై తీవ్రంగా దాడి చేయడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సోనార్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పోలీసులు త్వరితగతిన స్పందించి అభిషేక్ బెనర్జీని ముట్టడించి, బూతులు తిడుతూ అల్లరి సృష్టించిన ఐదుగురు స్థానిక నిందితులను నిన్ననే అరెస్ట్ చేశారు. ఇక ఈ దాడికి నిరసనగా టీఎంసీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి హోరెత్తించాయి. హుగ్లీ జిల్లా చుంచుడాలోని పిపుల్పాతి జంక్షన్ వద్ద మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగడంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించి, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. నిజానికి అసిత్ మజుందార్ అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా జోలాఘాట్ నుంచి బీర్పాతి వరకు ముందే అనుకున్న నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే, ఆ సమయంలోనే అత్యాచారాలు, దాడులు ఎదుర్కొంటున్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన అభిషేక్ బెనర్జీపై గుడ్లు, చెప్పులు విసిరి అవమానించారనే వార్త తెలియడంతో తన మద్దతుదారులతో కలిసి అక్కడే ధర్నాకు కూర్చున్నారు. అనంతరం పోలీసులు వచ్చి ప్రదర్శనకారులను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.





