ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన 47వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు భారీ స్కోరు సాధించారు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన రోహిత్ శర్మ, ఈ మ్యాచ్లో తిరిగి జట్టులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేసి అవుట్ కాగా.. రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 44 బంతుల్లో 84 పరుగులు చేసి మహహ్మద్ షమీ బౌలింగ్లో పెవిలియన్ కు చేరాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాల జాబితాలో ఇది ఐదవ స్థానంలో నిలిచింది.
ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ కొన్ని కీలక రికార్డులను నమోదు చేశాడు. రోహిత్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు, ఇది అతడి ఐపీఎల్ కెరీర్లో నాలుగో వేగవంతమైన అర్ధ సెంచరీ. గతంలో కోల్కతాపై 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా రోహిత్ పేరిట ఉంది. అలాగే, ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సార్లు (3 సార్లు) 100+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడిగా రోహిత్ శర్మ మరియు రియాన్ రికెల్టన్ రికార్డు సృష్టించారు. గతంలో రోహిత్ – ఇషాన్ కిషన్, పార్థివ్ పటేల్ – లెండిల్ సిమన్స్ వంటి జోడీలు రెండుసార్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
ముంబై ఇండియన్స్ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై విజయం సాధించాలంటే 35 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ తో పాటు తిలక్ వర్మ ఉన్నాడు. ఈ మ్యాచ్లో రికెల్టన్ 8 సిక్సర్లు, రోహిత్ 7 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.





