Instagram Star Murder: భార్య ఎదుగుతుంటే చూసి మురిసిపోవాల్సిన భర్త.. ఆమె పాపులారిటీని చూసి అసూయతో రగిలిపోయాడు. ఇన్స్టాగ్రామ్ స్టార్గా, ఫ్యాషన్ డిజైనర్గా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన నాగలక్ష్మి.. తన సొంత భర్త చేతిలోనే బలయ్యారు. చెన్నై నంగనల్లూరులో జరిగిన ఫ్యాషన్ డిజైనర్ నాగలక్ష్మి హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక భర్త సుబ్రహ్మణ్యం ఈగో సమస్య ప్రధాన కారణమని తెలుస్తోంది. నంగనల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం(52), నాగలక్ష్మి(42) దంపతులు గత కొంతకాలంగా గొడవ పడుతున్నారు. ఆమె పెద్ద కుమారుడు రష్యాలో ఎంబీబీఎస్ చదువుతుండగా, చిన్న కుమారుడు చెన్నైలో డెంటల్ కోర్సు చేస్తున్నాడు.
వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన నాగలక్ష్మి.. ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆమె డిజైన్లు, చీరలు కట్టుకునే విధానానికి ఫిదా అయిన సుమారు 3 లక్షల మంది ఫాలోవర్లు ఆమెకు ఉన్నారు. ఈ పాపులారిటీయే ఆమె పాలిట శాపంగా మారింది. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండే సుబ్రహ్మణ్యం.. భార్య సంపాదనపైనే ఆధారపడేవాడు. అయితే ఆమెకు వస్తున్న క్రేజ్ను చూసి అతను తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. రెండేళ్ల క్రితం గొడవ పడి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సుబ్రహ్మణ్యం.. వారం క్రితమే తిరిగి వచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్య ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోయిన సుబ్రహ్మణ్యం.. ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
తన ప్లాన్లో భాగంగా.. నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేట కొడవలితో నాగలక్ష్మిపై దాడి చేశాడు. తల, మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం భయంకరమైన మెసేజ్ను తన చిన్న కొడుకుకు పంపాడు. “నేను, అమ్మ ఇక ఉండం.. నీ కోసం అన్నం పెట్టాను వచ్చి తిను” అని చెప్పి, మరో గదిలో తాను కూడా ఉరివేసుకున్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





