Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది.. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలంలోని అడపారెడ్డి పల్లిలో కేవలం 10 అంకణాల (80 గజాల) స్థలం వివాదం కారణంగా వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్థల వివాదం ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది.
Read Also: Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!
పోలీసుల సమాచారం మేరకు, మృతుడు అమర్నాథ్ రెడ్డి (45)గా గుర్తించారు. ఎదురింటికి చెందిన రాహుల్ రెడ్డి అనే యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి కూతురు ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో బిర్యానీ విందు ఏర్పాటు చేసి ఆనందంగా గడుపుతున్నారు. ఈ సమయంలో అమర్నాథ్ రెడ్డి రెండో అంతస్తులో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా రాహుల్ రెడ్డి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక, అమర్నాథ్ రెడ్డి తండ్రి నాథముని రెడ్డిని కూడా హత్య చేయడానికి నిందితుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. గంజాయి మత్తులోనే రాహుల్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు నిందితుడి ఇల్లు, బైక్ను తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.





