Sudha Kongara: సినీ పరిశ్రమలో వందల కోట్ల వసూళ్లు సాధించిన బ్లాక్బస్టర్ సినిమా డైరెక్టర్కే పారితోషికం ఎగ్గొడితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక సంచలన ఘటనే ఇప్పుడు కోలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తన రెమ్యునరేషన్ బాకీల విషయమై మద్రాస్ హైకోర్టు మెట్లెక్కడం తీవ్ర కలకలం రేపుతోంది. శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ఆమె దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమాకు సంబంధించి రావాల్సిన రూ.8.39 కోట్ల బకాయిల కోసం ఈ లీగల్ పోరాటం మొదలైంది. దర్శకురాలు సుధా కొంగర మరియు నిర్మాణ సంస్థ ‘డాన్ పిక్చర్స్’ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ‘పరాశక్తి’ సినిమాకు గానూ ఆమెకు మాట్లాడిన మొత్తం పారితోషికం రూ.15 కోట్లు. దీనికి జీఎస్టీ (GST) అదనం కాగా, మొత్తం బిల్లు రూ.17.70 కోట్లకు చేరింది. అయితే, ఇందులో డాన్ పిక్చర్స్ కేవలం రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించిందని, ఇంకా రూ.8.39 కోట్లు భారీ బకాయి ఉంచేసిందని సుధా కొంగర తరపు న్యాయవాదులు నిత్యేష్ నటరాజ్, వైభవ్ వెంకటేష్ కోర్టుకు వివరించారు.
>ఈ ఏడాది (2026) జనవరిలో విడుదలైన ‘పరాశక్తి’ అనే పొలిటికల్ డ్రామా కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిందని నిర్మాణ సంస్థే స్వయంగా ప్రకటించుకున్నప్పటికీ, దర్శకురాలికి మాత్రం రావలసిన బాకీలను క్లియర్ చేయకపోవడం గమనార్హం. ఒకపక్క పాత బాకీలు తీర్చడం లేదని, కానీ అదే డాన్ పిక్చర్స్ సంస్థ తమ తదుపరి చిత్రం ‘ఇదయమ్ మురళి’ని జూలై 10న గ్రాండ్గా విడుదల చేయడానికి సిద్ధమవుతోందని సుధా కొంగర తరపు కౌన్సిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరి నిమిషంలో వచ్చి అడ్డుపడుతున్నారనే నెపం లేకుండా, ముందే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ కుమారేష్ బాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు. ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శ్యాటిలైట్ టెలికాస్ట్/రిలీజ్ను జూలై 8 వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా OTT రిలీజ్ అయింది. జూలై 10న విడుదల కాబోతున్న ‘ఇదయమ్ మురళి’ సినిమాను నిలిపివేయాలన్న సుధా కొంగర విజ్ఞప్తిపై జూలై 7 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డాన్ పిక్చర్స్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.





