Samudra: ఆంధ్రప్రదేశ్ సినీ రంగంలో హౌసింగ్ సొసైటీ స్థలాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న వసూళ్ల పర్వంపై ఏపీ ఎఫ్.డి.సి (APFDC) డైరెక్టర్, ప్రముఖ దర్శకుడు సముద్ర తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంతో గానీ, అక్కడ జరుగుతున్న ఆర్థిక లావాదేవీలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. గత కొన్ని రోజులుగా ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని, అందుకోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దర్శకుడు సముద్ర పూర్తి స్పష్టతనిచ్చారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ఎలాంటి స్థలాలను కేటాయించలేదు. ఈ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారంటూ కొందరు మిత్రులు నాకు ఫోన్ చేసి అడగడంతోనే అందరికీ నిజం తెలియజేయడానికి ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను,” అని సముద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం లేదా హౌసింగ్ సొసైటీల పేరు చెప్పి కొందరు వ్యక్తులు చేస్తున్న వసూళ్లను, జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సినీ కార్మికుల ఇళ్ల స్థలాల పేరుతో సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల వెనుక తన ప్రమేయం ఉందన్నట్లుగా ఎవరైనా మాట్లాడినా, లేదా తన పేరును వాడుకుని లబ్ధి పొందాలని చూసినా సహించేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. అటువంటి అక్రమ కార్యక్రమాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన ఏపీ ఎఫ్.డి.సి కమిటీ ఎంతో అద్భుతంగా పనిచేస్తోందని, ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఈ కమిటీ అనేక కీలక చర్యలు తీసుకోబోతోందని సముద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనపై నమ్మకంతో అప్పగించిన ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, రాష్ట్రంలో సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు శక్తీవంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.





