గత ఐపీఎల్ సీజన్లో 9వ స్థానంతో సరిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు, ఐపీఎల్ 2026లో అద్భుతంగా పుంజుకుని ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఆదివారం ముంబయి ఇండియన్స్పై సాధించిన విజయంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. రాజస్థాన్ జట్టు ఈ స్థాయికి చేరడం వెనుక 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఫామ్ కీలక పాత్ర పోషించింది. ఈ సీజన్లో 583 పరుగులు చేసిన సూర్యవంశీ, 232.27 స్ట్రైక్ రేట్తో, 52 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర చేశాడు. అయితే, ఈ యువకుడి దూకుడు జట్టులోని మరో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను మానసికంగా దెబ్బతీసిందని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సీజన్లో జైస్వాల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆయన 14 మ్యాచ్ల్లో 33.08 సగటుతో 397 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… “సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలు జైస్వాల్ను కాస్త కలవరపెట్టాయని నేను భావిస్తున్నాను. గతంలో రాజస్థాన్ జట్టులో జైస్వాల్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ఉండేవాడు. కానీ వైభవ్ రాకతో చర్చలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి. ఇది జైస్వాల్ను మానసికంగా ఒత్తిడికి గురిచేసింది. అందుకే చాలా మ్యాచ్ల్లో జైస్వాల్ బంతిని మరీ గట్టిగా బాదడానికి ప్రయత్నించి అవుటయ్యాడు” అని విశ్లేషించారు.
సెహ్వాగ్ – ఆకాశ్ చోప్రాలతో పోలిక..
ఈ పరిస్థితిని వివరించడానికి అశ్విన్ గతంలో భారత టెస్ట్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రాల ఉదాహరణను గుర్తుచేశారు. “సెహ్వాగ్ క్రీజులో ఉంటే ఆయన ఆడే విధ్వంసకర శైలి ముందు, అవతలి ఎండ్ లో ఆకాశ్ చోప్రా బాగా ఆడి 30-40 పరుగులు చేసినా కూడా ఎవరికీ కనిపించేది కాదు. ఇక్కడ కూడా వైభవ్ ఆడే ఆటతీరు ముందు జైస్వాల్ ఆట వెలవెలబోతోంది” అని పేర్కొన్నారు.
మెంటార్షిప్ అవసరం..
అయినప్పటికీ, గత కొన్నేళ్లుగా జైస్వాల్ భారత జట్టుకు, రాజస్థాన్కు ఎన్నో అద్భుత విజయాలు అందించాడని, అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని అశ్విన్ స్పష్టం చేశారు. డ్రెస్సింగ్ రూమ్లోకి ఒక కొత్త సూపర్ స్టార్ వచ్చినప్పుడు పాత ఆటగాళ్లపై ఉండే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి జైస్వాల్కు ఒక మంచి మెంటార్ లేదా సైకాలజిస్ట్ అవసరమని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ప్లేఆఫ్స్ లోనైనా జైస్వాల్ మళ్లీ తన మునుపటి ఫామ్ను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.





