NEET paper leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా వివాదమైన సమయంలో, కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)లో భారీ పరిపాలనా మార్పులు చేపట్టింది. ఎన్టీఏలో నలుగురు సీనియర్ అధికారుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీరిలో ఇద్దరిని జాయింట్ సెక్రటరీలుగా, మరో ఇద్దరిని జాయింట్ డైరెక్టర్లుగా నియమించారు. క్యాబినెట్ నియామకాల కమిటీ(ACC) ఆమోదం అనంతరం సిబ్బంది మరియు శిక్షణ విభాగం(DoPT) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
జాయింట్ సెక్రటరీలుగా ఇద్దరు అధికారిణిలను నియమించారు. అనుజా బాపత్ 1998 బ్యాచ్ ఐఎస్ఎస్(ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్) అధికారిణి కాగా, మరొకరు రుచితా విజయ్. ఈమె ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) 2004 బ్యాచ్ అధికారిని. వీరిద్దరిని ఐదేళ్ల పదవీకాలానికి నియమించారు. జాయింట్ డైరెక్టర్లుగా ఆకాష్ జైన్, ఆదిత్య రాజేంద్ర భోజ్గడియా నియమితులయ్యారు. ఆకాష్ జైన్ 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి కాగా, ఈయన సర్వీస్ డిసెబంర్ 4, 2029 వరకు ఉంటుంది. ఆదిత్య రాజేంద్ర భోజ్గడియ 2013 ఇండియన్ ఆడిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారి, ఈయన పదవీ కాలం మే 16, 2028 వరకు ఉంటుంది. ఎన్టీఏలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కోసం ఈ మార్పులు చేపట్టినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.





