MLA Arava Sridhar Controversy: లైంగిక వేధింపుల ఆరోపణలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నా… లోలోపల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇది సాధారణ అవినీతి ఆరోపణల వ్యవహారం కాదు. బాధితురాలు వీణ రోజుకో వీడియో రిలీజ్ చేస్తోంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే చేసిన వీడియో కాల్స్కు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. సభ జరుగుతున్న వేళ బాత్రూమ్కు వెళ్లి వీడియో కాల్స్ చేయడంతోపాటు.. సభలో ఉన్న సమయంలో కూడా వీడియో కాల్స్ చేశాడు అరవ శ్రీధర్.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అరవ శ్రీధర్ హాజరు కావడం లేదు. నియోజకవర్గంలో ఉన్నారా..? అంటే అదీ లేదు. విజయవాడలోనే ఉన్నప్పటికీ అసెంబ్లీ వైపు మాత్రం వెళ్లడంలేదు. పార్టీ ఆదేశాల మేరకే ఆయన సభకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారిన కారణంగా… అసెంబ్లీకి ఆయన హాజరు లేనిపోని వివాదాలకు దారితీసే అవకాశం ఉందని జనసేన భావించినట్టు సమాచారం. అరవ శ్రీధర్ అసెంబ్లీకి వస్తే… పార్టీ ఇమేజ్పై ప్రభావం పడుతుందేమోననే ఆందోళన కూడా ఉంది. అరవ శ్రీధర్ను కాపాడేందుకు జనసేన ప్రయత్నిస్తోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వస్తే… అతడిపై ఉన్న ఆరోపణలనే వైసీపీ ప్రధాన అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని భావించి… ముందు జాగ్రత్తగా సభకు దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది.
అయితే… అసెంబ్లీకి దూరంగా ఉండాలని అరవ శ్రీధర్కు ఎవరూ చెప్పలేదని… అసెంబ్లీకి రాకుండా పార్టీ అడ్డుకోలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయనే మౌనం పాటిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ వ్యవహారంతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని… ఇది పూర్తిగా ఒక మహిళకు, శ్రీధర్కు మధ్య ఉన్న వ్యక్తిగత వ్యవహారమేనని… ఇందులో పార్టీ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జనసేన త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తోంది. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు అరవ శ్రీధర్పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయ్యాయి. మరోవైపు బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం కల్పించాలని వరుసగా వీడియోలు విడుదల చేస్తోంది.





