Petrol and Diesel Prices Drop: ఓవైపు ఇంధన కొరత.. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ మరియు డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో, ధరల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం, పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించి, లీటరుకు సుమారు రూ.10 వరకు ఉపశమనం కల్పించింది. అలాగే డీజిల్పై కూడా అదే స్థాయిలో సుంకం తగ్గించబడింది.
Read Also: IPL 2026 Full Schedule ఇదే.. 70 మ్యాచ్లు, 13 వేదికలు.. ఉప్పల్లో 7 మ్యాచుల వివరాలు మీ కోసం..
గతంలో పెట్రోల్పై లీటరుకు సుమారు రూ.13 ఎక్సైజ్ సుంకం ఉండగా, ఇప్పుడు దాన్ని సుమారు రూ.3కు తగ్గించారు. ఇక డీజిల్పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా సున్నాకు తగ్గించడం విశేషం. దీంతో వినియోగదారులకు నేరుగా లీటరుకు రూ.10 వరకు లాభం చేకూరనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ (VAT) యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి, రాష్ట్రానికో రాష్ట్రం ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల రవాణా ఖర్చులు తగ్గే అవకాశముండగా, దాని ప్రభావం ఇతర అవసర వస్తువుల ధరలపై కూడా కనిపించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, పెరుగుతున్న ఇంధన ధరల మధ్య కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు కొంత ఊరటనివ్వనుంది.





