దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం నుంచే హడలెత్తిస్తున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి నుంచి మే నెల వరకు దేశమంతటా వేడిగాలులు ఉంటాయని.. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా ఉంటుందని.. 2024 సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సగటు కంటే చాలా ఎక్కువగా పెరిగినట్లుగా తెలిపింది. వేసవి కాలం పెరుగుతున్న కొద్దీ అనేక రాష్ట్రాలు తీవ్రమైన వేడి ఉంటుందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.
2026 వేసవి కాలం.. 2024లో కనిపించిన రికార్డు స్థాయి కంటే ఎక్కువగా వేడిగాలులు దాటే అయ్యే అవకాశం ఉందని తెలిపింది. 2024 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో భారతదేశం 2010 తర్వాత అత్యధిక వేడిగాలులను చూసింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వారాల పాటు 50 డిగ్రీలు నమోదైంది. మే 29న ఢిల్లీలోని ముంగేష్పూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2026 మధ్య నాటికి లా నినా నుంచి ఎల్ నినో పరిస్థితులకు మార్పు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. చారిత్రాత్మకంగా భారతదేశంలో ఎల్ నినో సంఘటనలు తీవ్రమైన వేడిగాలులు, రుతుపవనాల అసమానతలతో ముడిపడి ఉంటుంది. ఈ ఏడాది వాతావరణంలో మార్పులు తప్పవని హెచ్చరించింది.





