Off The Record: ప్రకాశం జిల్లా జనసేనలో ఎన్నికలకు ముందు వరకూ అంతా ఓకే అన్నట్టుగానే ఉన్నా.. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలోకి ఎంట్రీ ఇచ్చాక ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో…జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఒక జట్టుగా పనిచేశారు. ఇక ఎన్నికల తర్వాతి పరిణామాలతో… ఒంగోలు వైసీపీ కార్పొరేటర్స్లో కొందరు బాలినేనితో పాటు జనసేనలో చేరగా.. మరికొందరు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీకి దగ్గరయ్యారు. బాలినేని జనసేనలో చేరి 16 నెలలు గడుస్తున్నా…. ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదన్న బాధ ఉందట ఆ శిబిరంలో. ఇక పాత సాన్నిహిత్యంతో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, అదే పార్టీలో యాక్టివ్గా ఉన్న కంది రవిశంకర్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో కలసి రాజకీయాలు నడుపుతున్నారు. ఇది పైకి కూటమి ధర్మంలా కనిపిస్తున్నా….అంతర్గతంగా మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి టార్గెట్గానే అడుగులు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవి టీడీపీకి రావాల్సి ఉన్నా…ఎమ్మెల్యే దామచర్ల పట్టుబట్టి తన పార్టీ నాయకులందర్నీ ఒప్పించి మరీ రియాజ్కు వచ్చేలా చేశారని చెప్పుకుంటారు. ఇందులో కూటమి ధర్మంకంటే బాలినేనికి చెక్ పెట్టే వ్యూహమే ఉందని, అందుకు తగ్గట్టు రియాజ్ కూడా తమ పార్టీ నాయకుడైన బాలినేనికంటే ఎమ్మెల్యే దామచర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నది ఒంగోలు వాయిస్. ఈ పరిణామాలతో మాజీ మంత్రి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఆ మధ్య మార్కాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేనిపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చెప్పారు. గతంలో పరిస్దితులు ఎలా ఉన్నా.. కూటమిలోకి వచ్చాక అందరూ ఒకటేనని.. సర్దుకుని కలిసి పనిచేసుకోవాల్సిందేనని చెప్పడంతో… అంతా సెట్ అవుతుందని అనుకున్నారుగానీ…. అంతర్గతంగా రగులుతూనే ఉంది. అసలు కూటమితో సర్దుబాట్ల సంగతేమోగానీ… అసలు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ అదే పార్టీ నేత బాలినేనితో కలసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఓడా ఛైర్మన్గా రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాలినేనిని ఆహ్వానించలేదు సరికదా.. కనీసం ఫ్లెక్సీల్లో సైతం ఆయన ఫోటో కనిపించకపోవటం చర్చనీయాంశమైంది.ఆ కధ అలా… నడుస్తున్న క్రమంలో జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒంగోలులో వివాదాస్పదమైంది. జిల్లాలోని పలు నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జ్లను ఒంగోలులోని తన ఆఫీస్కు పిలిచి ప్రోగ్రామ్ చేశారు మాజీ మంత్రి. కానీ.. అక్కడికి రియాజ్ టీమ్ను పిలవలేదు. ఈ క్రమంలో.. తాజాగా జరిగిన మరో విడత కార్యక్రమం హాట్ టాపిక్ అయింది. రియాజ్ టీమ్ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్కు బాలినేనితో పాటు ఆయనకు దగ్గరగా ఉండే పార్టీ నేతలకు, కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు సైతం ఆహ్వానాలు అందలేదని తెలిసింది. దాంతో ఈ పరిణామాలను జనసేన జిల్లా పరిశీలకుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు బాలినేని. కొణతాల ఒంగోలు వచ్చి శ్రీనివాసరెడ్డికి ఆయన ఇంట్లో కలిశారు. ఈ సందర్బంగా జిల్లా జనసేనలో జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారని తెలిసింది.
పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్కు బీ టీంలాగా మారిపోయారన్నది బాలినేని వర్గం ఆరోపణ. దామచర్లకు అనుకూలంగా పార్టీని నడిపిస్తూ లైనప్ను దెబ్బతీస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జనసేనలో ఉంటూ… జనార్థన్కు జైకొట్టిన వాళ్ళకే ప్రాధాన్యం దక్కుతోందని, తమకు కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం ఉండటం లేదని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇలా అయితే జిల్లాలో పార్టీ బలోపేతం సంగతి తర్వాత….. కనీస ఉనికి కూడా లేక టీడీపీ పైనే ఆధారపడాల్సి ఉంటుందని వివరించారట. ఇతర నియోజకవర్గాల జనసేన నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి నడుస్తున్నా… జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్న రియాజ్ కలుపుకుని పోయే ప్రయత్నం చేయడంలేదని, పిలవని కార్యక్రమాలకు నేను ఎలా వెళ్ళగలనంటూ మాజీ మంత్రి గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. అంతా విన్న కొణతాల….. జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు బాలినేనికి సముచిత ప్రాధాన్యం దక్కేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ పంచాయితీని పవన్కళ్యాణ్ ఎలా తీరుస్తారో చూడాలి.





