యూకేలోని మాంచెస్టర్ సినాగోగ్లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వారిని వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు.
గురువారం ఉదయం ఉత్తర మాంచెస్టర్లోని యుదుల ప్రార్థనా మందిరం వెలుపల వాహనంతో ఢీకొట్టి అనంతరం కత్తితో దుండగుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారని బ్రిటిష్ పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలిలోనే నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష సాక్షి ప్రకారం.. కారు నడుపుతున్న వ్యక్తి పాదచారులపైకి వాహనాన్ని పోనిచ్చాడని.. అనంతరం కత్తితో దాడి చేశాడని తెలిపారు. గురువారం ఉదయం 9:30 గంటలకు ఈ సంఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే హంతకుడ్ని కాల్చి చంపినట్లు సమాచారం.
హంతకుడి శరీరంపై అనుమానాస్పద వస్తువులు ఉండటంతో బాంబ్ స్క్వాడ్ మోహరించి నిర్వీర్యం చేశారు. భద్రతా సమస్యల కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇంకా బాధితులు, హంతకుడి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ప్రాథమిక విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అయితే ఈ దాడిని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు. ఇది దారుణ సంఘటనగా అభివర్ణించారు. ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన దాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితులు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్హామ్ స్పందిస్తూ.. యూదుల మందిరం దగ్గర జరిగిన సంఘటన తీవ్రమైన సంఘటనగా అభివర్ణించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. పోలీసులు వేగంగా స్పందించింది సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు.





