స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేసింది. ఏడేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు తెలిపింది. తన దీర్ఘకాల భాగస్వామి పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. సైనా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక ప్రకటన విడుదల చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. సైనా, పారుపల్లి 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందారు. కలిసి ఈ క్రీడలో పురోగతి సాధించారు. ఇద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు.
2012లో లండన్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది, 2015లో ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానానికి చేరుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. ప్రపంచ నంబర్ వన్ షట్లర్గా నిలిచిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి ఆమె. క్రీడలలో సైనా భారతదేశానికి ప్రపంచ ఐకాన్గా నిలిచింది. 2014లో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పారుపల్లి కశ్యప్ బంగారు పతకాన్ని సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన మంచి ప్రదర్శనతో అతను తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also Read:Jharkhand: రోజూ రైలులో ప్రయాణిస్తున్న కోతి.. కిటికీ పక్కన సీటులో కూర్చొని ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
ఆదివారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సైనా నెహ్వాల్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఆమె ఇలా రాసింది, ‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. చాలా ఆలోచించిన తర్వాత, కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము మా కోసం, ఒకరికొకరు శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాము. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలు.’ కాగా కశ్యప్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.





