భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం డీఆర్డీఓ చరిత్రలో మరో కీలక మైలురాయిగా మిగిలింది.
పరీక్ష సందర్భంగా నిర్దేశించిన అన్ని లక్ష్యాలు పూర్తిగా సాధించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్కు చెందిన వివిధ ట్రాకింగ్ పరికరాలు సేకరించిన సమాచారంలో క్షిపణి నిర్దేశిత పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు నిర్ధారణ అయింది. ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇందులో ఉపయోగించిన అన్ని ఉపవ్యవస్థలను డీఆర్డీఓకు చెందిన పలు ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమ భాగస్వాములు రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) ప్రధాన ప్రయోగశాలగా వ్యవహరించింది.
క్షిపణి ప్రయోగాన్ని డీఆర్డీఓ సీనియర్ అధికారులు, భారత నౌకాదళం, భారత వైమానిక దళానికి చెందిన ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ విజయవంతమైన పరీక్షపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, సిబ్బంది, పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా పేర్కొన్నారు.
పరీక్షా కార్యక్రమం మొత్తం సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇతర బృంద సభ్యులను అభినందించారు. ఈ విజయంతో భారత్ స్వదేశీ క్షిపణి సాంకేతికతలో మరో కీలక మైలురాయిని అధిగమించినట్లు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.





