Southwest Monsoon: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని మిగతా జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లే సమయంలో చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలని, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు అవసరమైతే తప్ప ఎండలో తిరగవద్దని సూచించింది.
అలాగే ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని హెచ్చరించింది. వర్షాల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి ఉండే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా కన్నూరిపాలెంలో అత్యధికంగా 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేటలో 42.7 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెంలో 37.5 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా చిలకలపల్లిలో 35.2 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 26.7 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.





