NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఒక వ్యవస్థీకృత, అనేక రాష్ట్రాల నెట్వర్క్ పేపర్ లీక్కు కారణమై ఉంటుందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రాజస్థాన్ నుంచి హర్యానా, ఢిల్లీ, కేరళ, జమ్మూ కాశ్మీర్, బీహార్ వరకు ఈ వ్యవస్థ విస్తరించి ఉంది. ఈ పేపర్ లీక్ నాసిక్ నుంచి మొదలై హర్యానా, జైపూర్ నుంచి జమ్వారామ్గఢ్, సికార్ చేరింది. సికార్ నుంచి జమ్మూ కాశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ వరకు ఈ పేపర్ లీక్ చేయబడినట్లు గుర్తించారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇప్పుడు, ఈ పరీక్షను రద్దు చేయడం విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది
సికార్ నుంచే లీక్:
రాజస్థాన్లోని సికార్లో ప్రశ్నాపత్రాలు లీక్ ఎక్కువగా జరిగినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కోటా తర్వాత సికార్ కోచింగ్ సెంటర్లకు హబ్గా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు సికార్లో మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ఇదే సమయంలో లీక్ అయినట్లు భావిస్తున్న ప్రశ్నాపత్రాన్ని, గెస్ పేపర్గా చెబుతూ అనేక కోచింగ్ సెంటర్లు తమ విద్యార్థులకు బోధించినట్లు తెలుస్తోంది.
ఇదే ప్రశ్న వస్తుందని చెబుతూ విద్యార్థులకు బోధించారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఏ ప్రశ్న అయితే వస్తుందని చెప్పారో, అవే నీట్ పరీక్షల్లో కనిపించినట్లు తెలుస్తోంది. బయాలజీ నుంచి 90 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నలను ఎంపిక చేసిన కొద్ది మంది విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. ఇదే నిజమైతే ఇది గెస్ పేపర్ కేసుగా కాకుండా పేపర్ లీక్ కేసుగా పరిగణించనున్నారు. గెస్ పేపర్గా చెబుతున్న దాంట్లోని సుమారు 140 ప్రశ్నలు యథాతథంగా నీట్ పేపర్లో కనిపించినట్లు తేలింది.
ఈ మొత్తం వ్యవహారంలో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, పరీక్షకు ముందు కొంత మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం వచ్చినట్లు ఫోన్ వచ్చిందని తేలింది. ఈ మెటీరియన్లను ముందుగా లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. పరీక్ష దగ్గర పడుతున్నా కొద్ది పేపర్ను రూ. 5000 నుంచి రూ. 30,000 వరకు విద్యార్థులకు అమ్మినట్లు తేలింది.
కోచింగ్ సెంటర్ల ప్రమేయం:
ఈ సమస్య కేవలం విద్యార్థులకు మాత్రమే పరిమితం కాలేదు. పలు కోచింగ్ సెంటర్లు, హాస్టల్ నెట్వర్క్కు కూడా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే సికార్కు చెందిన ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతను ఆ పేపర్ను కేరళలో ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి రూ. 30000 అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్లో ఒక హాస్టల్ నివసిస్తున్న అమ్మాయిలు కూడా ఇదే పేపర్ను పంపిణీ చేసినట్లు వెల్లడైంది.
వాట్సాప్ నుంచి అనేక యాప్లో సర్క్యూలేట్:
విచారణలో మరో విషయం తేలింది. ఈ ప్రశ్నాపత్రం కేవలం వాట్సాప్ కు మాత్రమే పరిమితం కాలేదు. అనేక మెసేజింగ్ యాప్ల ద్వారా కూడా షేర్ చేయబడినట్లు తెలుస్తోంది. అనేక సార్లు ఫార్వర్డ్ అయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే లీక్ చాలా మందికి చేరినట్లు అర్థమవుతుంది.
ప్రింటింగ్ ప్రెస్లో లీక్ అయిందా?
ఈ మొత్తం వ్యవహారంలో ఈ ప్రశ్నాపత్నం ఎక్కడి నుంచి లీక్ అయిందనేది కీలకంగా మారింది. ఈ లీక్లో ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా రాజస్థాన్ నాగౌర్ కనెక్షన్ ఇందులో ఉంది. ఒక విద్యార్థికి రూ. 28 లక్షలకు ఆ పేపర్ను అమ్మినట్లు సమాచారం. నాగౌర్కు చెందిన విద్యార్తి 4 రోజులు ముందు సికార్ చేరుకోగా, అతడికి పేపర్ అందించినట్లు తెలిసింది.





