ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం ఓ కిలాడీ కంత్రీ స్కెచ్ గీసింది. ప్లాన్ అమలుకు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకుంది. పక్కా ప్రణాళికతో కిడ్నాప్ ప్లాన్ అమలు చేసింది. పాపం పండి చివరికి కటకటాలపాలైంది. అసలు.. స్కెచ్ ఏంటి? కిడ్నాప్ ఏంటి? ఎప్పుడు? ఎక్కడ జరిగింది?. నిందితుల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలియాలంటే ఇంట్రెస్టింగ్ వార్త చదవాల్సిందే.
హైదరాబాద్లోని సూరారం ప్రాంతం. రెండు రోజుల క్రితం.. మే 4న మల్లారెడ్డి ఆస్పత్రి ఎదురుగా ఉన్న పుట్పాత్పై నిద్రస్తున్న 6 నెలల పాప కిడ్నాప్కు గురైంది. తల్లిదండ్రుల పక్కను నిద్రస్తున్న చిన్నారిని చప్పుడు లేకుండా ఎత్తుకెళ్లిపోయారు. లేచి చూసేసరికి బిడ్డ కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో చిన్నారి కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో నిందితుల కోసం గాలింపు చేపట్టగా 48 గంటల్లోనే శ్రీదేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సహకరించిన మరో నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు.
ఇక ప్రధాన నిందితురాలు శ్రీదేవిని విచారించగా సంచలన విషయాలు వెల్లడించింది. తన ఆడపడుచుకు పిల్లలు లేరని.. దీంతో నిత్యం కృంగిపోతుందని.. ఆమె బాధను చూడలేక.. ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం చిన్నారిని కిడ్నాప్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
శ్రీదేవితో పాటు నలుగురు నిందితులంతా కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజేంద్రనగర్ ప్రాంతంలో శ్రీదేవి పనిచేసే క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి మైలార్దేవ్పల్లిలో నివాసం ఉంటుంది. తన ఆడపడుచు కోసం ఎలాగైనా ఒక బిడ్డను బహుమతిగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కిడ్నాప్ చేసినట్లుగా నిందితురాలు వివరించింది.





