CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై , ఆ పార్టీ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ప్రతి యాక్టివిటీకి ఒక ప్రయోజనం (Purpose) ఉంటుందని, ఆ ప్రయోజనం తీరిపోయాక దానికి విలువ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చాక అది ఎలాగైతే గతమైపోయిందో, కేసీఆర్ పార్టీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే మారిందని రేవంత్ ఎద్దేవా చేశారు.
“బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఒక చచ్చిపోయిన శవంతో సమానం. దానికి గతం ఉంది కానీ భవిష్యత్తు లేదు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా అది తిరిగి రాదు” అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ సాధనలో వారు ఎంత అసహ్యంగా వ్యవహరించినా రాష్ట్రం కోసం ప్రజలు భరించారని, రాష్ట్రం వచ్చాక వారి అహంకారాన్ని, అహంభావాన్ని కూడా సహించారని గుర్తు చేశారు. 14 ఏళ్ల ఉద్యమం వారిని కాపాడిందని, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు చేసిన ఆగడాలను చూసి ప్రజలు 2023లో ఓడించి, పార్లమెంట్ ఎన్నికల్లో ‘గుండు సున్నా’ ఇచ్చారని మండిపడ్డారు. కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, తెలంగాణ ప్రజలతో వారి సంబంధాలు తెగిపోయాయని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఆరోగ్యం విషయంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్కు దెబ్బ తగలగానే మానవత్వంతో ఆసుపత్రికి వెళ్లింది నేను. అసెంబ్లీకి వస్తే ఆయన సీటు వరకు వెళ్లి యోగక్షేమాలు అడిగింది నేను. కేసీఆర్ చనిపోవాలని నేను ఎందుకు అనుకుంటా? గతంలో నేపాల్ రాజును చంపింది వారి కుటుంబ సభ్యులే. అలాగే కేసీఆర్ కుటుంబానికే ఆయన అవసరం ఉండొచ్చు కానీ, నాకు కాదు” అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. “బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడి మీద ఒట్టేసి చెప్పగలడా?” అని సవాల్ విసిరారు. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా ఏం చేశారో అందరికీ తెలుసని, ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తున్నప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ నుంచి విడిపోయిన విభాగాలు లేదా కొత్తగా వస్తున్న ముసుగులన్నీ ఒకే తాను ముక్కలని రేవంత్ అభివర్ణించారు. “వీరంతా ఒకే చెరువు నీళ్లు. వీరి రంగు, రుచి, వాసన మారదు. పంపకాల పంచాయతీతో వచ్చిన విభాగమే ఇదంతా” అని ఎద్దేవా చేశారు. తమ ఎంపీ కావ్య మాట్లాడిన నిజాలు బీఆర్ఎస్ ‘వెదవలకు’ వినిపించడం లేదని, వెదవలకు అందరూ వెదవల్లాగే కనిపిస్తారని రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలంతో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇక తెలంగాణలో స్థానం లేదని ఆయన తేల్చిచెప్పారు.





