Yuvraj Singh 6 Sixes Story: టీ20 ప్రపంచకప్ 2007ను ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సీజన్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది యువరాజ్ సింగ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. టీ20 అంతర్జాతీయ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించాడు. యువరాజ్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పటికీ.. బ్రాడ్ పరిస్థితి దిగజారింది. ఆ ఎదురుదెబ్బ నుంచి కోలుకోవడానికి ఆ ఇంగ్లాండ్ పేసర్ చాలా కృషి చేశాడు. ఎన్నో కష్టాలను అధిగమించి చివరికి ఇంగ్లాండ్ ఆధునిక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అయితే, ఆ మ్యాచ్ తర్వాత జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను యువీ ఇటీవల మైఖేల్ వాన్ షో ‘ది ఓవర్ లాప్’లో పంచుకున్నాడు. ఆ సిక్సర్ల వర్షం కురిసిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, మ్యాచ్ రిఫరీ అయిన క్రిస్ బ్రాడ్ తన వద్దకు వచ్చారని యువీ గుర్తు చేసుకున్నాడు.
“నువ్వు దాదాపు నా కొడుకు కెరీర్ను ముగించేశావు” అని క్రిస్ బ్రాడ్ తనతో అన్నారని యువరాజ్ వెల్లడించాడు. “సర్, నా బౌలింగ్లో కూడా ఒకప్పుడు ఐదు సిక్సర్లు పడ్డాయి, ఆ బాధ నాకు తెలుసు” అని ఆ తండ్రికి సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాదు.. క్రిస్ బ్రాడ్ ఒక జెర్సీపై సంతకం చేసి ఇవ్వమని యువరాజ్ను కోరాడట. “నా బౌలింగ్లో కూడా ఐదు సిక్సర్లు పడ్డాయి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా ఎదుగుతావని ఆశిస్తున్నాను” అని యువీ జెర్సీపై రాసి ఇచ్చాడట. అయితే, ఆ జెర్సీని స్టువర్ట్ బ్రాడ్ కోపంతో డస్ట్బిన్లో పడేశాడని యువీకి ఈ మధ్యే తెలిసింది. ఆ స్థాయిలో అవమానం జరిగినప్పుడు ఆ కోపం రావడం చాలా సహజమని, అది ఏమాత్రం తప్పు కాదని యువరాజ్ పేర్కొన్నాడు. ఆ దెబ్బతో కుంగిపోకుండా బ్రాడ్ 600 పైగా టెస్ట్ వికెట్లు తీసి లెజెండరీ బౌలర్గా ఎదగడం గొప్ప విషయమని కొనియాడాడు.
READ MORE: Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్లైన్ను దెబ్బతీసిన ఇరాన్!





