పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం యుద్ధం మరింత భయాందోళనలు కలిగిస్తోంది.
తాజాగా భారత సహాయం కోసం ఢిల్లీకి రావాల్సిన ఇరాన్ విమానంపై అమెరికా దాడి చేసింది. దీంతో మహాన్ ఎయిర్ విమానం దెబ్బతింది. ఇరాన్ ప్రజలకు అవసరమైన వైద్య, సహాయ సామగ్రిని తీసుకొచ్చేందుకు భారత్కు బయల్దేరాల్సిన విమానం ఇరాన్లోని మషద్ విమానాశ్రయంలో నిలిచి ఉంది. అయితే అమెరికా జరిపిన వైమానిక దాడితో విమానం ధ్వంసం అయింది. దీంతో మానవతా సహాయానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అయితే ఈ వార్తను అమెరికా అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
మషద్ విమానాశ్రయం ఇరాన్లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్లోని మషద్లో ఉన్న ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం పౌర, సైనిక ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మషద్ విమానాశ్రయంపై అమెరికా దాడి తర్వాత విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్.. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ విమానం ఏప్రిల్ 1న ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా భారతదేశం మార్చి 18న ఇరాన్కు మొదటి విడత వైద్య సామాగ్రిని పంపింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సహాయానికి భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. అప్పటి నుంచి అనేక నగరాల్లోని ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రజలు నిధులు, సహాయక సామగ్రిని విరాళంగా ఇస్తున్నారు.





