Petrol, Diesel Shortage: రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వదంతులు నమ్మవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయనే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ నిల్వలపై పర్యవేక్షిస్తోందని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే క్రమశిక్షణతో పెట్రోలు, డీజిల్ ను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
READ MORE: Gold &Silver Rates: బంగారం, సిల్వర్ ధరల్లో పెద్ద షాక్.. ఈరోజు రేటు ఎంత పెరిగిందో చూడండి
‘‘అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఇండియన్ ఆయిల్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి అన్ని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీల వద్ద అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉంది. పెట్రోలు, డీజిల్ సరఫరాలోను లోపం లేదు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్ కూడా స్పష్టం చేసింది’’ బండి సంజయ్ అని తెలిపారు. ‘‘పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లను, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మి చాలా మంది పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీస్తూ ట్యాంకులు నింపుకుంటూ, అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరగడంవల్ల కొన్ని పెట్రోలు బంకుల్లో తాత్కాలిక స్టాక్ కొరత ఏర్పడుతోంది. దానివల్ల వాహనదారులకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయి. ఇదే అదనుగా కొంతమంది క్రుత్రిమ కొరత స్రుష్టించి బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ నిల్వలపై పర్యవేక్షిస్తోంది. క్ర్రుత్రిమ కొరత స్రుష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే క్రమశిక్షణతో పెట్రోలు, డీజిల్ ను కొనుగోలు చేయాలని విజ్ఝప్తి చేస్తున్నా. తద్వారా పెట్రోల్ బంకుల్లో క్రుత్రిమ కొరత ఇబ్బందుల్లేకుండా యథావిధిగానే సరఫరా కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు.





