“ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు” అనే నానుడిని నిజం చేస్తూ తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, అన్నదాతలకు సాగు పెట్టుబడి సాయం కింద రూ. 3,600 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ నిధులు సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రేపటికల్లా జమ అవుతాయని, మిగిలిన వారికి కూడా మరో 45 రోజుల్లో రైతు భరోసా అందుతుందని ఆయన హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతులకు రెట్టింపు సాయం అందిస్తోందని సీఎం గణాంకాలతో వివరించారు. కేసీఆర్ హయాంలో నెలకు సగటున రూ. 2,533 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,500 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. గత 28 నెలల కాలంలో రైతుల కోసం ఏకంగా లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరి ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టిన రైతులకు అభినందనలు తెలుపుతూ, పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు.
Man Kills Wife: లవ్ మ్యారేజ్, నాలుగు నెలలకే భార్య దారుణహత్య..
రాష్ట్రంలో పసుపు వంటి పంటలకు ధరలు మారుతున్న నేపథ్యంలో రైతులు సాంప్రదాయ పంటల నుండి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయడమే లక్ష్యమని, ఇందుకోసం తన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను పెంచేందుకు ఇక్రిశాట్ వంటి సంస్థల సేవలను వినియోగించుకుంటామని, పంట మార్పిడిపై చర్చించేందుకు త్వరలోనే కేంద్ర మంత్రులతో కలిసి ప్రధానిని కలుస్తామని చెప్పారు. “నిజామాబాద్లోని అంకాపూర్ గ్రామంలాగా తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం” అని ఆయన ఆకాంక్షించారు.
రైతులతో పాటు మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం పేర్కొన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం నెలకు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తున్నామని, వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఘనత కాంగ్రెస్దేనని అన్నారు. మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను 65 లక్షల నుండి కోటి మందికి పెంచి, వారిని కోటీశ్వరులుగా మార్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదానీ, అంబానీలతో పోటీపడి మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తామని, మహిళలకు పెట్రోల్ బంకుల కేటాయింపు వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వచ్చే ఉగాది నాటికి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని, తనను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కాచెల్లెళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ ఏడాది నుండి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ నిర్వహిస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు. “నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో పోను.. తెలియనిది అడిగి తెలుసుకుంటాను. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే నిజమైన బంగారు తెలంగాణ” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.





