Ind vs Pak : టీ20 వరల్డ్ కప్లో దాయాది దేశాల మధ్య జరిగిన హై-వోల్టేజ్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో పాకిస్తాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన పాక్ను భారత్ 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, తన అజేయమైన రికార్డును కొనసాగించింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ లేని లోటును భర్తీ చేస్తూ హార్దిక్ పాండ్యా, మొదటి ఓవర్లోనే సాహిబ్జాదా ఫర్హాన్ను డకౌట్ చేసి వికెట్ మెయిడిన్తో శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తన మొదటి ఓవర్లోనే ప్రమాదకరమైన సయీమ్ అయూబ్ (6) , సల్మాన్ అఘా (4)లను అవుట్ చేసి పాక్ వెన్ను విరిచాడు.
మధ్య ఓవర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పాక్ను కోలుకోనివ్వలేదు. ముఖ్యంగా పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. ఉస్మాన్ ఖాన్ (44) ఒక్కడే కాసేపు ప్రతిఘటించినా, అతడిని కూడా అక్షర్ స్టంప్ అవుట్ చేయడంతో పాక్ పతనం వేగవంతమైంది. చివరికి హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన బౌలింగ్తో ఉస్మాన్ తారిఖ్ను బౌల్డ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను ముగించాడు. 17.6 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో.. హార్దిక్ పాండ్యా, బుమ్రా కీలక వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లతో రాణించారు. వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ చేరువలోకి రావడం విశేషం. ఈ విజయంతో టీమిండియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. పాక్ బ్యాటర్ల తప్పుడు షాట్ సెలక్షన్ను భారత బౌలర్లు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఫీల్డింగ్లో కూడా రింకూ సింగ్, దూబే అద్భుతమైన క్యాచ్లు పట్టి బౌలర్లకు అండగా నిలిచారు. గతేడాది ఛాంపియన్లుగా ఉన్న భారత్, ఈ ఏటా అదే జోరును కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీనితో భారత్ T20 ప్రపంచ కప్లలో పాకిస్తాన్పై 8-1తో ఆధిక్యంలో ఉంది.





